ఇండియన్ నేవీ 2700 సెయిలర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫీషర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పూర్తిచేసినవాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఈ పోస్టుల్లో చేరితే ఆకర్షణీయ వేతనాలతోపాటు ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. సెయిలర్ పోస్టులకు అర్హులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు (పీఎఫ్టీ), మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్టిఫీషర్ అప్రెంటీస్గా చేరినవారు నౌకలు, ఇతర సాంకేతిక పరికరాల నిర్వహణ, మరమ్మతులు చూసుకుంటారు. ఆవిరితో నడిచే యంత్రాలు, డీజిల్, గ్యాస్ టర్బైన్లు, మిసైళ్లు, ఆటోమేటిక్ కంట్రోల్ వెపన్లు, సెన్సార్లు, నౌకాయాన పరికరాలు, కంప్యూటర్లు, అడ్వాన్స్డ్ రేడియో ఎల్రక్టిక్ పవర్ సిస్టమ్స్ వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేది వీరే. అభ్యర్థి స్పెషలైజేషన్ ఆధారంగా బాధ్యతలను కేటాయిస్తారు. ఎస్ఎస్ఆర్లు ఎయిర్ క్రాఫ్ట్లను మోసుకెళ్లే నౌకలు, మిసైల్ డెస్ట్రోయర్లు, సబ్ మెరైన్లలో విధులు నిర్వర్తిస్తారు.
పరీక్ష విధానం
రెండు విభాగాలకు పరీక్ష ఉమ్మడిగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఇస్తారు. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, జనరల్ నాలెడ్జ్. ప్రశ్నలన్నీ 10+2 (ఇంటర్మీడియట్) స్థాయిలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. అన్ని సెక్షన్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్ ఉన్నవారిని తర్వాతి దశకు తీసుకుంటారు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా 8000 మందిని పీఎఫ్టీకి ఎంపిక చేస్తారు.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు (పీఎఫ్టీ): ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 స్క్వాట్స్, 10 పుష్అప్స్ తీయగలగాలి. క్రీడలు, ఈతలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఫిజికల్ టెస్టులో అర్హత సాధించినవారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైతే శిక్షణలోకి తీసుకుంటారు.
ఆగస్టులో శిక్షణ: మెడికల్ టెస్టులో అర్హత సాధించినవారికి ఆగస్టు 2020 నుంచి చిల్కా సరస్సులో ప్రాథమిక శిక్షణ మొదలవుతుంది. ఏఏ పోస్టుల్లో చేరినవారికి 9 వారాలు, ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకైతే 22 వారాల శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచి/ ట్రేడుల్లో ఏదైనా నేవీ ట్రెయినింగ్ కేంద్రంలో శిక్షణ ఉంటుంది.
శిక్షణ సమయంలో రూ.14,600 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా ప్రొఫెషనల్ శిక్షణను పూర్తిచేసుకున్నవారిని సెయిలర్ - ఏఏ / ఎస్ఎస్ఆర్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం తోపాటు మిలట్రీ సర్వీస్ పే రూ.5,200, గ్రూప్-ఎక్స్ పే రూ.6,200 (ఏఏ పోస్టులకు), డీఏ ప్రతినెలా లభిస్తాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలిపి ఎస్ఎస్ఆర్లు ప్రారంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతనం పొందవచ్చు.
ఏఏకు ఎంపికైనవారు 20 సంవత్సరాలు, ఎస్ఎస్ఆర్లో చేరినవారు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సర్వీస్ పొడిగిస్తారు. వ్యవధి తర్వాత పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పింఛను జీవితాంతం లభిస్తుంది. సెయిలర్/ ఏఏగా విధుల్లో చేరినవారు మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్-1 (లెవెల్ 8) హోదా వరకు చేరుకోవచ్చు.
ఖాళీల వివరాలు
ఏఏ-500, ఎస్ఎస్ఆర్-2200
విద్యార్హత: ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ల్లో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫీషర్ అప్రెంటిస్ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. రెండు పోస్టులకూ పురుష అభ్యర్థులే అర్హులు.
వయసు: ఆగస్టు 1, 2000 - జులై 31, 2003 మధ్య జన్మించినవారే అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 18
పరీక్షలు: www.joinindiannavy.gov.in
please do not enter any spam link in the coment box.